మణిపూర్ లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసకు ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. తాజాగా మరోసారి అక్కడ హింస చెలరేగింది. కాంగ్పోక్పి జిల్లా హరోథెల్ గ్రామంలో గురువారం జరిగిన అల్లర్లను ఆపేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా.. అతని మృతదేహాన్ని ఇంఫాల్ కు తీసుకొచ్చారు. ఇది తెలుసుకున్న ప్రజలు అతనికి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు. మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరాంబండ్ బజార్ కు తీసుకొచ్చారు. కొందరు నిరసనకారులు శవపేటికను ఊరేగింపుగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసానికి తీసుకెళ్తామని హెచ్చరించారు. పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రోడ్ల మధ్యలో టైర్లు కాల్చారు. దీంతో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టడానికి బాష్పవాయువును ప్రయోగించారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో మృతదేహాన్ని జవహర్ లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని మార్చురీకి తరలించారు. మణిపూర్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మైతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా ప్రకటించింది. అయితే నాగా, కుకీ సామాజిక వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మే 3న మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. నాటి నుంచి ఆ అల్లర్లు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అల్లర్లు, హింసాత్మక సంఘటనల్లో సుమారు 120 మందికిపైగా పౌరులు మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. https://t.me/offerbazaramzon
ఇంఫాల్ లో భాష్పవాయువు ప్రయోగం !
June 30, 2023
0
Tags