భార్యపై అనుమానంతో పసికందు హత్య

Telugu Lo Computer
0


చైన్నెలోని కొరటూరుకు చెందిన కుమరేశన్‌ (32) రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి పెళ్లాంతో రాజేశ్వరితో నలుగురు కొడుకుల్ని కన్న అతగాడు.. సంగీత (24) అనే మహిళను కొంతకాలం క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. 29 రోజుల కిందటే సంగీత ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప పుట్టినప్పటి నుంచి సంగీతను భర్త వేధిస్తూ వచ్చాడు. ఆ బిడ్డ తనకే పుట్టిందా? లేక మరొకడికి పుట్టిందా? ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకున్నావా? అంటూ సూటిపోటి మాటలతో ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నాడు. బిడ్డ పుట్టినప్పటి నుంచే కాదు.. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కుమరేశన్ అనుమానంతో సంగీతను టార్చర్ పెడుతూ వచ్చాడు. ఇక బిడ్డ పుట్టాక అతని వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. అతని వేధింపులు భరించలేకపోయిన సంగీత.. భర్త మీదున్న కోపాన్ని పసికందుపై చూపించింది. శనివారం రాత్రి తన భర్త నిద్రలోకి జారుకున్న తర్వాత.. సంగీత ఆ 29 రోజుల పసికందును గొంతునులిమి చంపేసింది. అనంతరం.. పుదుకుప్పం బీచ్ వద్ద ఇసుకలో ఆ చిన్నారి మృతదేహాన్ని పూడ్చేసింది. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి తిరిగొచ్చి.. భర్త పక్కన పడుకుంది. ఆదివారం ఉదయాన్నే లేచి చూడగా.. చిన్నారి కనిపించకపోవడంతో భర్త ప్రశ్నించాడు. తనకు తెలియదని ఆమె సమాధానం ఇచ్చింది. దీంతో.. భార్యాభర్తలిద్దరు కలిసి పాప ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టారు. మరోవైపు.. బీచ్ ఆసుకలో పాతిపెట్టిన చిన్నారి పాదం బయటకు కనిపించడాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పాప మృతదేహం లభ్యమైన విషయం తెలిసి.. కుమరేశన్, సంగీత దంపతులు సంఘటనా స్థలానికి చేరుకొని, బోరున విలపించారు. చంపింది తానే అయినా, సంగీత ఏడ్చినట్టు నటించింది. తన మామే బిడ్డను కిడ్నాప్ చేసి, హత్య చేసి ఉంటాడని కుమరేశన్ అనుమానం వ్యక్తం చేశాడు. అయితే.. పోలీసులకు మాత్రం సంగీతపై అనుమానం వచ్చి, ఆమెను విచారించారు. అప్పుడు సంగీత అసలు విషయం బయటపెట్టింది. తనకు బిడ్డ పుట్టినప్పటి నుంచి భర్త తనను అనుమానించి, ప్రతి రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని తెలిపింది. బిడ్డ తనకు పుట్టిందా? అంటూ తనతో భర్త వాదిస్తున్నాడని పేర్కొంది. దీనికితోడు తానూ అనారోగ్య బారిన పడటంతో.. ఏం చేయాలో పాలుపోక చిన్నారిని చంపాలని నిర్ణయించుకున్నానని ఆమె వాంగ్మూలం ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)