తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలోని మలైక్కుడిపట్టిలో వేల్, పళనియమ్మాళ్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, సుబ్రమణ్యన్ అనే కుమారుడు ఉన్నారు. సుబ్రమణ్యన్కి గనకు అనే యువతికి ఇచ్చి పెళ్లి చేశారు. భర్త లేకపోవడంతో పళినియమ్మాళ్ తన కొడుకు, కోడలి వద్దే ఉంటోంది. పెళ్లైన కొత్తలో అత్తాకోడళ్ల మధ్య సఖ్యత బాగానే ఉండేది కానీ, రానురాను వారి బంధం చెడింది. తరచూ గొడవలు జరగడం మొదలైంది. ప్రతీ చిన్న విషయంలోనూ 'నువ్వా-నేనా' అన్నట్టు గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికొచ్చిన పళనియమ్మాళ్, కోడలిని పిలిచి తన కోసం టీ పెట్టాలని కోరింది. అయిష్టంగానే కోడలు టీ పెట్టి ఇచ్చింది. అయితే.. టీ చల్లారిపోవడంతో కోడల్ని అత్త మందలించింది. దీంతో ఆ ఇద్దరి మధ్య మళ్లీ మాటామాట పెరిగి, గొడవ ముదిరింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన గనకు, ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డు తీసుకొని అత్త తలపై బాదింది. ఈ ఘటనలో పళనియమ్మాళ్ తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు వదిలినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పళనియమ్మాళ్, గనకు మొదటి నుంచే సఖ్యత లేదని స్థానికులు చెప్తున్నారు. పళనియమ్మాళ్ చాలాకాలం నుంచి మానసిక వ్యాధితో బాధపడుతోందని, అందుకు చికిత్స కూడా తీసుకుంటోందని తెలిపారు.
ప్రాణం మీదకు తెచ్చిన టీ తంటా !
March 10, 2023
0
Tags