తమిళనాడు భారతీయ జనతా పార్టీ ఐటీ-సోషల్ మీడియా ప్రెసిడెంట్ సీటీఆర్ నిర్మల్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామాకు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైనే కారణమని రాజీనామా లేఖలో ఆరోపించారు. అంతే కాకుండా అన్నామలైని '420 మలై' అంటూ ఘాటుగా విమర్శించారు. కాగా, తమిళ భాషలో రాసిన రాజీనామా లేఖను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నో ఇక్కట్లు ఎదురైనప్పటికీ ఎంతో నిజాయితీగా, ఎంతో కష్టపడి పని చేశానని పేర్కొన్నారు. తాను ఎందుకు రాజీనామా చేస్తున్నానో క్యాడర్ కు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని సీటీఆర్ నిర్మల్ కుమార్ తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన నిర్ణయాల్ని తప్పుబట్టారని అన్నారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే నిఘా పెట్టారని ఆరోపించారు. తాను న్యాయ పోరాటం చేస్తున్న డీఎంకే మంత్రితో అన్నామలై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన ఆయన, అన్నామలైని ‘420 మలై’ అంటూ విమర్శించారు. ''420 మలై ద్రవిడ్ మాల్ మంత్రులను మించిన వాడు. బీజేపీకే కాదు తమిళనాడుకు కూడా చాలా ప్రమాదకరం'' అని నిర్మల్ కుమార్ అన్నారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆయన అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఏఐడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీకి గుడ్ బై చెప్పిన తమిళనాడు ఐటీసెల్ ఇన్ చార్జ్
March 05, 2023
0
Tags