ఒడిశా లోని కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్ సమితి తొయపుట్ గ్రామంలో ఓ యువకుడు భార్య, కుమార్తెను హతమార్చి తరువాత ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. లక్ష్మీపూర్ ఠాణా అధికారి శ్వేత పద్మ శెఠి అందించిన వివరాల ప్రకారం తొయపుట్కు చెందిన లింగరాజు బిశోయ్ (27) స్థానికంగా చరవాణి దుకాణం పెట్టుకుని జీవించేవాడు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండడంతో పాటు అప్పుల పాలైపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆదివారం సాయంత్రం చరవాణి దుకాణం నుంచి ఇంటికి చేరుకుని అన్ని తలుపులు వేసి, ముందుగా భార్య జ్యోత్స్న (24) మెడకు చరవాణి ఛార్జర్ వైరు బిగించి హతమార్చాడు. పక్కనే ఉన్న రెండేళ్ల కుమార్తె గొంతుకు తాడు చుట్టి చంపేశాడు. అనంతరం తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చాలాసేపు ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో రాత్రి 9 గంటలకు పొరిగింటి వారు తలుపు తట్టారు. లోపల నుంచి స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగును పిలిచారు. అందరూ తలుపులు విరగ్గొట్టి చూడగా ఒకే గదిలో మూడు మృతదేహాలు కనిపించాయి. కుటుంబమంతా నిర్జీవంగా పడి ఉన్న దృశ్యం చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. సమాచారం అందుకున్న లక్ష్మీపూర్ పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటిని సీజ్ చేశారు. సోమవారం ఉదయం మృతదేహాలను పరీక్షకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులతోనే లింగరాజు అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్య
February 14, 2023
0