రెండు వారాల్లో అనుమానాస్పదంగా మూడో రష్యన్ మృతి

Telugu Lo Computer
0


రష్యాకు చెందిన మరో వ్యక్తి ఒడిశాలో అనుమానాస్పదంగా మరణించాడు. ఒడిశా, జగత్‌సింగ్ పూర్ జిల్లా, పరదీప్ పోర్టులోని ఒక నౌకలో మిల్యాకోవ్ సెర్గీ అనే రష్యా వ్యక్తి మరణించినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ నౌక బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టు నుంచి పరదీప్ మీదుగా ముంబై వెళ్తోంది. ఇటీవలే రష్యాకు చెందిన ఇద్దరు పౌరులు ఒడిశాలోని ఒక హోటల్‌లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. వీరి మరణానికి సంబంధించిన మిస్టరీ వీడకముందే మరో రష్యన్ పౌరుడు మరణించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మృతుడు మిల్యాకోవ్ సెర్గీ 'ఎంబీ అల్ద్నాహ్' అనే నౌకలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లు పోలీసలు తెలిపారు. మంగళవారం వేకువఝామున నాలుగున్నర గంటల సమయంలో అతడి మృతదేహాన్ని అదే నౌకలోని ఒక ఛాంబర్‌లో గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ జరుపుతున్నారు. అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పరదీప్ పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ పీఎల్. హరానంద్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. గత డిసెంబర్‌లో ఒడిశా పర్యటనకు వచ్చిన ఇద్దరు రష్యన్ ప్రజా ప్రతినిధులు రాయగడ్‌లోని ఒక హోటల్‌లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ మరణాలపై ఒడిశా సీఐడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)