నూతన సంవత్సరం ప్రారంభ రోజు స్టాక్ మార్కెట్ల సూచీ పెరిగినప్పటికీ ఆ మరుసటి రోజు నుంచి భారీగా పతనం అవుతూ వస్తుంది. వడ్డీరేట్ల పెంపుపై వెనుకంజ వేయబోమని అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించిన నాటి నుంచి సూచీలు దిగువ ముఖం పట్టాయి. గత మూడు సెషన్లలో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,400 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక, టెక్నాలజీ రంగ షేర్లలో క్రయ విక్రయాలు భారీగా జరగడం ఇందుకు కారణం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యంపోసింది. దీంతో రూ.5 లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. 52 వారాల కనిష్ఠ స్థాయికి 28 స్టాక్లు పడిపోయాయి. వీటిలో ఆవాస్ ఫైనాన్షియల్, బయోకాన్, థైరోకేర్ టెక్నాలజీతోపాటు మరో 25 సంస్థలు ఉన్నాయి. ఇదే సమయంలో 100 సూచీలు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 3,564 స్టాక్ల్లో 2,204 షేర్లు పతనమవగా..1,227 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ సూచీలు అత్యధికంగా నష్టపోయాయి. టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్లు పతనం చెందాయి. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 940.37 పాయింట్లు లేదా 1.55 శాతం, నిఫ్టీ 245.85 పాయింట్లు లేదా 1.36 శాతం పతనం చెందాయి.
5 లక్షల కోట్ల ముదుపర్ల సొమ్ము ఆవిరి
January 07, 2023
0