ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ ల మీదుగా భారత్ వరకు నిర్మించ తలపెట్టిన ట్రాన్స్ అఫ్గాన్ పైప్ లైన్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తుర్క్మెనిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు “అఫ్గాన్ ప్రాంతీయ సమాఖ్య” అనే అంశంపై చైనా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తుర్క్మెనిస్తాన్ ఈప్రకటన చేసింది. ఆఫ్గానిస్తాన్ తో వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలు పెంపొందించు కుంటామని, ఎనర్జీ, రవాణా, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో ఆఫ్గానిస్తాన్ సంస్థలతో కలిసి కొత్త ఉమ్మడి ప్రాజెక్టులను అమలు చేస్తామని తుర్క్మెన్ ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్ తో దౌత్య సంబంధాల బలోపేతం ఇతర అంశాలపై చర్చించేందుకు గానూ..భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం తుర్క్మెనిస్తాన్ చేరుకున్నారు. ఈక్రమంలో తుర్క్మెనిస్తాన్ నుంచి భారత్ వరకు నిర్మించ తలపెట్టిన ఈ “ట్రాన్స్ నేషనల్ గ్యాస్ పైప్ లైన్” అంశం మరోసారి ప్రాధానత్య సంతరించుకుంది. “టాపి”గా పిలిచే ఈ గ్యాస్ సరఫరా ప్రాజెక్ట్ లో తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు భారత్ లు భాగస్వామ్యంగా ఉన్నాయి. తుర్క్మెనిస్తాన్లోని భారీ గ్యాస్ క్షేత్రాలు ఉన్న గల్కినిష్ ప్రాంతం నుంచి అఫ్గాన్, పాకిస్తాన్ మీదుగా భారత్ లోకి ప్రవేశించే ఈ భారీ గ్యాస్ సరఫరా ప్రాజెక్టును 1,127 మైళ్ల పొడవుతో TAPI దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పైప్ లైన్ నిర్మాణం పూర్తయ్యి.. అందుబాటులోకి వస్తే ఏడాదికి 33 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను సరఫరా చేయవచ్చు. అయితే పైప్ లైన్ నిర్మాణ నిమిత్తం నిధుల సమీకరణతో పాటు ఆఫ్గానిస్తాన్ లో నెలకొన్న జాతీయ అస్థిరత కారణంగా ఈ మెగా ప్రాజెక్టు చాలా రోజులుగా అమలుకు నోచుకోలేదు. ఇటీవల ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు సద్దుమణగడంతో తిరిగి ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన సమయం వచ్చినట్లుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్ వరకు గ్యాస్ పైప్లైన్
April 02, 2022
0
Tags