విజయవాడ తూర్పు బైపాస్కు సంబంధించిన ప్రాథమిక నివేదిక తయారు చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్) అధికారులను కేంద్రం ఆదేశించింది. దీంతో ఎన్హెచ్ అధికారులు ఈ ప్రాజెక్టుపై కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారం బైపాస్ 75 కిలోమీటర్లకు పైగా పొడవు ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం చోడవరం వంతెనకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. నాడు విజయవాడ తూర్పు బైపాస్కు ఆంధ్రజ్యోతి పలు సూచనలు చేసింది. దానికి అనుగుణంగానే కేసరపల్లి నుంచి కంకిపాడు బైపాస్ మీదుగా పెనమలూరు వెలుపల నుంచి చోడవరం మీదుగా గుంటూరుకు కనెక్ట్ అయ్యేలా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. జాతీయ రహదారుల సంస్థ దీనిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఒక ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. విజయవాడ తూర్పు బైపాస్ను కూడా చిన అవుటపల్లి దగ్గర నుంచి తీసుకురావాలని అలైన్మెంట్ సూచించారు. ఎన్హెచ్ అలైన్మెంట్ ప్రకారం ఈ బైపాస్ చిన అవుటపల్లి నుంచి కంకిపాడు, పెనమలూరు వెలుపల నుంచి కృష్ణానది మీదుగా కాజ దగ్గరకు చేరుకుంటుంది. మొత్తం అలైన్మెంట్ 40 కిలోమీటర్లు ఉంటుందని గుర్తించారు. విజయవాడ పశ్చిమ బైపాస్ కూడా చిన అవుటపల్లి నుంచి గన్నవరం, నున్న, గొల్లపూడి వెలుపల నుంచి ఎన్హెచ్ - 65 మీదుగా కృష్ణానది మీదుగా కాజ వెళుతుంది. తూర్పు బైపాస్ కూడా చిన అవుటపల్లి నుంచే మొదలై కాజ దగ్గర పూర్తయ్యేలా అలైన్మెంట్ను రూపొందించారు. ఈ అలైన్మెంట్ను ఇంకా ఫైనల్ చేయలేదు. ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ 40 కిలోమీటర్ల అలైన్మెంట్ వల్ల భూ సేకరణ వ్యయం కూడా చాలా తగ్గుతుందన్నది ఎన్హెచ్ అధికారుల భావన. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటికీ, భూ సేకరణలో చెరి సగం భరించాలనే కేంద్ర ప్రభుత్వ సూచనకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు ప్రాధాన్యత రీత్యా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినా.. కాస్ట్ షేరింగ్ అంటే ఎటువంటి వైఖరి తీసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. తూర్పు బైపాస్ భూ సేకరణకే రూ.800 కోట్ల వ్యయం అవుతుందన్నది తాత్కాలిక అంచనా. 50 శాతం కాస్ట్ షేరింగ్ అంటే దాదాపు రూ.400 కోట్ల వరకూ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత మొత్తాన్ని భరిస్తుందా? అనేది ఇప్పుడు తలెత్తుతున్న సందేహం. విజయవాడ బెంజ్సర్కిల్ - ఫ్లైఓవర్ సర్వీసు రోడ్డుకు భూసేకరణకు సంబంధించి రూ.35 కోట్ల పరిహారాన్ని ఇవ్వాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పట్టించుకోవడం లేదు. సర్వీసు రోడ్డు విస్తరణ కంటే పది రెట్లు అదనంగా అయ్యే భూ సేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించగలదా? అనేది కూడా ఒక సందేహం. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదించిన ప్రాజెక్టు కాబట్టి వెనకడుగు వేస్తే విమర్శల పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ నెల 17వ తేదీన బెంజ్సర్కిల్ - 2 ఫ్లై ఓవర్ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు.
విజయవాడకు తూర్పు బైపాస్
February 10, 2022
0
Tags