ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరానికి ఎవరైనా ప్రముఖులొస్తే చాలు ప్రజలు ట్రాఫిక్తో ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు వివిధ కార్యక్రమాల నిమిత్తం శుక్రవారం విశాఖకు వచ్చారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్ఏడీ నుంచి పీˆఎంపాలెం వరకూ దాదాపు 15 కి.మీ. పరిధిలో జాతీయ రహదారిపై పలు చోట్ల ఎక్కడికక్కడ వాహనాలు బారులు తీరాయి. చాలా కూడళ్ల వద్ద రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను మళ్లించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటల నుంచే ఎన్ఏడీ వద్ద వాహనాల రాకపోకలు నిలిపేశారు. అప్పుడు ఆగిన వాహనాలు దాదాపు 11 కి.మీ.లలోని మద్దిలపాలెం చేరుకునేందుకు రాత్రి ఏడు దాటిపోయింది. సత్యం కూడలిలో సాయంత్రం 6 గంటల సమయంలో ఏకంగా రెండు బస్సులను అడ్డంగా ఉంచి ట్రాఫిక్ నిలిపేశారు. ప్రయాణికులతో కూడిన బస్సులను రోడ్డుపైనే అలా ఉంచేయడంతో పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. హెచ్బీ కాలనీ నుంచి ఇసుకతోట వైపు కూడా రద్దీ నెలకొంది. ముఖ్యమంత్రి తిరిగి వెళ్లే వరకు గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక, ఎండాడ వద్ద వాహనదారులు అవస్థలుపడ్డారు.
ట్రాఫిక్ సుడిలో విశాఖపట్నం
December 18, 2021
0