విజయవాడ నగర శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గుంటుపల్లి గ్రామంలోని ఓ అపార్ట్మెంట్లోకి ఐదుగురు సభ్యుల ముఠా ప్రవేశించింది. అర్ధరాత్రి దాటాక 2గంటల సమయంలో కర్రలు, మారణాయుధాలతో చెడ్డీగ్యాంగ్ ప్రవేశించడం అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ సమయంలో అలికిడి రావడంతో ఓ ప్లాట్ యజమాని కారిడార్లోని లైట్లు వేయడంతో ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడ్డ ముఠా (చెడ్డీ గ్యాంగ్)నే ఇక్కడా చోరీకి విఫలయత్నం చేసిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చెడ్డీగ్యాంగ్ పేరు విన్న పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.