ఆంధ్రప్రదేశ్ శాసన సభలో శుక్రవారం జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీలో తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో బోరున విలపించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానాలను ఎదుర్కొనలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. 'భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైకాపా నేతలు మాట్లాడడం బాధ కలిగించింది. క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వ హననం) సహేతుకం కాదు. నేను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగాం. విలువల్లో రాజీపడే ప్రసక్తి లేదు' అని పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఆమెతో పాటు నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని కానీ వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం దారుణమని ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేస్తున్నారన్నారు. తెలుగు ప్రజలందరూ టీడపీ వెంటే ఉన్నారని సుహాసిని పేర్కొన్నారు.
నేను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగాం
November 20, 2021
0
Tags