చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని, ఇది కుదరని పక్షంలో మరింత మందిని అనుమతించాలని కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. గత నెలలో చార్ధామ్ యాత్రపై స్టే ఎత్తివేసిన కోర్టు.. కొవిడ్ను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్యపై పరిమితి విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బద్రీనాథ్కు రోజుకు వెయ్యి మంది భక్తులు, కేదార్నాథ్కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఈ ఆంక్షలు సడలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరణ దరఖాస్తు దాఖలు చేసింది. పరిమితిని పూర్తిగా తొలగించలేని పక్షంలో.. బద్రీనాథ్, కేదార్నాథ్కు రోజుకు మూడు వేల మంది భక్తులను, గంగోత్రికి వెయ్యి మందిని, యమునోత్రికి 700 మందిని అనుమతించాలని కోరింది. ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన ఈ యాత్ర నవంబరు మధ్య వరకే కొనసాగుతుందని, ప్రస్తుతం భక్తుల సంఖ్యపై పరిమితి కారణంగా యాత్రికులపై ఆధారపడి ఉన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.